Monday, December 12, 2022

సంగీతనిలయం ..కధ

సంగీతనిలయం '' అన్న బోర్డ్ ని తదేకంగా చూస్తూ ఆప్యాయంగా తడుముతున్నారు రాఘవరావుగారు . అది తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత రాగనిధికి నిదర్శనం . తమ తాత, ముత్తాతల నుంచీ అందరూ సంగీతకోవిదులే. ఆ తరం కళలకిచ్చే గౌరవాలే వేరు . ప్రతీఇంటా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది . తెల్లారితే సుప్రభాతం , వేద పారాయణ పఠనం వినిపిస్తూ ఉండేది .చాలాఇళ్లల్లో సంగీతసాధన మొదలైయ్యేది . శ్రావ్యమైన కంఠాలతో పిల్లలు పాడుతూఉంటే , స్నానాది ,సూర్యనమస్కారాలు ఆచరించడానికి చెరువులకు వెళ్లేవారికి వీనులవిందయ్యేది . అప్పటి వాతావరణంలో పెరిగిన పిల్లలందరికీ సంగీత, సాహిత్యాలలో ఒకరినిమించి ఒకరు రాణించాలన్న తపన, పట్టుదల ఉండేవి. అటువంటి వారిలో తనూ ఒకడిగా తాతగారిదగ్గర నేర్చుకున్న సంగీతం తన గళానికే వన్నెతెచ్చింది . సాదరమైన ఆహ్వానాలు , సన్మాలమధ్య , '' సంగీత కళా తపస్వి '' అన్న బిరుదు
మరింత కీర్తిని తెచ్చిపెట్టింది .

తాతదగ్గరే తను పెరిగేడు . తనని కన్న నాలుగేళ్లకే తల్లి కన్నుమూసింది .తండ్రి ఉన్నా లేనట్టే. తనని పట్టించుకున్నవారే లేని సమయంలో తాత చేయూత, అమ్మమ్మ ఆప్యాయతా తనని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దేయి .

తాతయ్య క్రమశిక్షణకి ప్రాధాన్యమిచ్చే మనిషి . వంశపారంపర్యంగా వస్తున్న సంగీతాన్ని సాధన చేస్తూ , పల్లెలోఉన్న చాలామంది పిల్లలకు సంగీతగురువైన తాతయ్యకు , తాను ప్రియశుష్యుడ య్యేడు . రాగం, తానం, ఆలాపన, స్వరకల్పనల మధు రసాలు తనలో వయసుతోపాటు వృద్ధిచెందుతూ వచ్చేయి .

ఆ ఆనందం , సంగీతం పట్ల ప్రజలు చూపించే గౌరవం , సంగీతసభల సుగంధాలు తనలో జీర్ణించుకుపోయాయి . కాలం , కాలంతో పాటు వయసుతెచ్చిన వృద్ధాప్యం తన గొంతుమీద దాడిచేసాయి . ఊపిరినిలిపి పాడడం కష్థం అయ్యింది . కచేరీలు తగ్గేయి . ఈతరం వారి అభిరుచులలో కూడా చాలా మార్పు వచ్చింది . కానీ రాఘవరావుగారి తృష్ణ తీరలేదు . తనపిల్లలకి నేర్పి వారిని తీర్చి దిద్దుదామన్న ఆశ నిరాసే అయ్యింది . తన సహధర్మచారిణి సీతమ్మకి పాటరాదు . అసలు గొంతే పలకదు . కనీసం సంగీతం పట్ల ఆసక్తి కూడా లేదు. పిల్లలకి ఆమె పోలికే... అన్నట్లు , ఎవరి గొంతులోనూ సంగీత స్వరాలు పలికేవికావు . దానితో రాఘవగారు నిరాశ, నిస్ప్రుహలతో మూగబోయారు . దానికితోడు మారుతున్నకాలంతోపాటు మనుషుల అభిరుచులూ, వెకిలి సాహిత్యాల వెర్రికూతలూ, ఆచారవ్యవహారాల అంతులేని మార్పులూ మొగ్గలుతొడిగాయి . జనం పగలబడి ప్రాధాన్యత యిచ్చే పాటలకు సాహిత్యం కరువయ్యేది ,.సంగీతం బరువయ్యేది . రాఘవగారిలాంటి ఎందరికో ఈ మార్పు తీర్పులేని విచారణయ్యేది .

అటువంటి సమయంలో '' కావ్య '' పుట్టుక మహదానందాన్నిచ్చింది . కావ్య..తన మనుమరాలు , అది పుట్టినప్పుడే దాని కంఠంలో సప్తస్వరాల కదలికలు గమనించేరు . పెరుగుతున్న కావ్యతో బాటు అలనాటి సంగీత, సాంప్రదాయ కళా వైభవపు పరిమళాలు ఆమెలో గుప్పించారు .అతని నమ్మకం వమ్ముకాలేదు . శ్రావ్యమైన కంఠం , భగవంతునిమీద భక్తి , పురాణాలపై ఆసక్తి , అన్ని మంచి గుణాలకీ పెట్టయ్యింది కావ్య.

రాఘవగారి వడలిన జవసత్వాలలో బలం పుంజుకొంది . కంఠంలో కరడుకట్టిన సంగీతం కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చీ, కావ్య గొంతుకి పదును పెట్టింది . ఫలితం ఎనిమిది సంవత్సరాల కావ్య సంగీతసరస్వతే అయ్యింది . తనుచెప్పిన తన చిన్ననాటి ముచ్చట్లు , కచేరీలు, సన్మాలగురించిన విన్న కావ్యమనసులో చిన్నికోరిక . తనూ కచేరీ చేయాలనీ, తాతయ్యలా చప్పట్లమధ్య కానుకలు గెలుచుకోవాలని .మనుమరాలి కోరిక, తన వాంచ ,తీరేందుకై రాఘవగారు తన సాయశక్తులా ప్రయత్నించీ చివరకు ఒక శ్రీరామనవమి సందర్భం లో కావ్యచే త్యాగరాజకృతులు పాడించేందుకు ఒక సభవారిని ఒప్పించగలిగేరు .

ఆ కాలంలో సంగీతకళాకోవిదులని వెతుక్కుంటూ వచ్చీ సాదరంగా వేదికమీదకు తీసుకువెళ్లేవారు . పాదాభివందనాలు , పూలాభిషేకాలతో పట్టం కట్టేవారు . కచేరీ పూర్తయ్యేదాకా జనం గౌరవంగా కూర్చొనేవారు . కచేరీ పూర్తి అయ్యినతర్వాత పాడినవారి శాంతి మంత్రాలముగింపు తర్వాత భక్తిగా దండాలు పెడ్తూ ఇళ్లకు తిరిగి వెళ్లేవారు . కానీ మారే మనిషి కాలం పేరుతో మన సంస్కృతీ, సాంప్రదాయాలని మూలకి నెట్టివేసేరు . కళాపోషకులు కరువై కళోద్ధరణకి కాకాలు పట్టవలసివస్తున్నాది .

ఆత్మాభిమానం చంపుకొని , మనుమరాలి కోర్కె తీర్చగలుగుతున్నందుకు ఒకపక్క ఆనందంగా ఉన్నా ..మరోపక్క అర్ధిస్తేగానీ అందని అవకాసాన్ని తలుచుకొని కృంగిపోయారు . కానీ మనుమరాలికి వచ్చిన మొదటి అవకాసం దిగ్విజయంగా పూర్తయితేచాలనీ , ఆమె గాత్రం, ప్రతిభ తెలిసినతర్వాత మరెన్నో అవకాసాలు రావచ్చన్న ఆలోచనలు ఆయన్ని రాత్రంతా నిద్రపోనివ్వలేదు . మగతనిద్రలో కావ్య కోకిలకంఠంతో పాడిన కీర్తనలకి , జనాల చప్పట్ల జోరు ,ప్రసంసల హొరుల తీపి కలల మధ్య తెల్లారినసంగతికూడా తెలియలేదు . కావ్యవచ్చీ లేపేదాకా.

గబగబా స్నానం ముగించుకొని పూజగదిలోకివచ్చేరు . పూజగదిలో కావ్య పుత్తడిబొమ్మలాగున్నాది . పట్టుపరికిణీ , జాకట్టు , జడగంటలు పెట్టిన పూలజడ , బంగారు భరణాలతో ,మెరుస్తూంటే , లక్ష్మీ , సరస్వతులు తనయింట నాట్యం చేస్తున్నట్లనిపించింది . ప్రసాంతమైన మనస్సుతో రామష్థ్థోత్తర పూజ ముగించీ, ఆ స్వామివారి కృపాక్షతలను కావ్యపైవేసి మనసారా దీవించేరు.

ఇంటందరికీ ఒకటే హడావిడి . సాయంత్రం కాగానే కావ్యని ముద్దుగా తయారు చేసీ ,సందడిగా బయలుదేరేరు . పాడవిసిన స్థలం దగ్గరవుతున్నకొద్దీ అందరిలో ఒకటే ఆనందం , ఆతృత.
ఎంతమంది వచ్చీ ఉంటారో...కావ్యపాటవిని ఎంత ప్రసంసిస్తారో అనుకుంటూ , హాలులో ప్రవేసించిన వారి కనులకి ఖాళీ జంబుఖానాలూ , కుర్చీలూ వెక్కిరిస్తూ కనిపించేయి . ఎవరో నలుగురు కమిటీ సభ్యులు అటూ, ఇటూ తిరుగుతూ వీరినిచూసీ ,దగ్గరకువచ్చేరు .వారిలోకూడా నిరాస కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాది .

రాఘవగారిలో చిన్ని ఆశ . సంగీతం యిష్ఠం ఉన్న తనలాంటివాళ్లు కొంతమందైనా లేకపోరు . ఇంకా సమయం ఉంది కనకా జనం తాపీగా రావొచ్చన్న ఆశ నిరాసే అయ్యింది . ఏడవుతూండగా మరో నలుగురువచ్చేరు . మరిరారని నిర్ధారించీ కమిటీ సభ్యులు కార్యక్రమం ప్రారంభించమని కోరడంతో , రావుగారు కావ్యవైపు చూసేరు .

ఎంతో ఉత్సాహంతో పదిరోజులుగా తెల్లారి నాలుగు గంటలకే లేచీ సాధనచేస్తూ వచ్చిన కావ్యమొహం చిన్నబోయింది . రావుగారు కావ్య వేపు సూటిగా చూడలేకపోయారు . బోసిగావున్న ఆడిటోరియం తన ఆలోచనలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాది . తననుతాను సంభాళించుకొని ఒక
ధృఢనిశ్చయానికి వచ్చినరాఘవగారు , కావ్యతో '' ఎవరు విన్నా, వినకపోయినా ఆ శ్రీరామచంద్రులవారు నీ పాట వింటారమ్మా ...మొదలెట్టూ...అనగానే , తాతయ్య మాటలకు ఒక్కసారి ఆ దేవునివైపు చూసి , భక్తిగా నమస్కరించీ ,పాడడం మొదలెట్టింది .

అద్భుతమైన గాత్రం. అనంతమైన స్వర`జ్నానం.గంటసేపు సభాధ్యక్షులని ఏవేవో లోకాలకు తీసుకువెళ్లింది .చప్పబారిన చప్పట్లమధ్య ఎవరో మొబైల్ తో కావ్యని ఫోటో తీసేరు . కార్యవర్గం సభ్యులు వచ్చీ కావ్యచేతికి పూలగుచ్చాన్నిచ్చీ ప్రసంసించేరు . రెండు, మూడు గంటలుసాగవలసిన కచేరీ గంటలో పూర్తయ్యింది జనం లేనందున.

రాఘవగారు కావ్యచూపులని తప్పించుకు నడుస్తున్నారు. పరివారం వైపు చూడడానికే చిన్నతనంగా ఉంది. కొడుకు ఎన్నిసార్లు చెప్పలేదు , నాన్నగారూ.. పాత బాణీలకీ, పద్ధతులకీ ఈరోజుల్లో విలువనిచ్చేవారు ఎవరూ లేరంటూ....
చిన్నారి కావ్యకి తను ఎన్ని ఆశలు చూపించేడు .మన సాంప్రదాయాలకి , సంగీతానికీ మనవాళ్లు ఎంతవిలువనిస్తారో వివరించీ ఎంతలాచెప్పేడు . కానీ తను చెప్పిందేమిటీ ...జరిగిందేమిటీ....ఆలోచిస్తూనే రాఘవగారు కావ్య చేయి పట్టుకొని నడుస్తున్నారు .

రోడ్డుకి అవతలివైపు వేరేచోట రామనవమి సందర్భంగా ఎవరిదో ఆర్కెష్థ్రా తెప్పించినట్లున్నారు . ఈవైపువరకూ నిండిన జనం , ఈలలతో, వాయిద్యాల ఘోషతో రోడ్డు క్రిక్కిరిసి ఉంది .

కావ్యని ఎత్తుకొని , జనాన్ని తప్పించుకుంటూ రావడం లో అప్రయత్నంగా అటువైపు చూసేరు రాఘవగారు . ఆధునాతంగా అలంకరించబడ్డ స్థేజి మీద సీతా,రాముల విగ్రహాలు మూలగా అలంకరించబడ్డాయి . స్ఠేజి మధ్య పాడేవారికోసం మైకులు అమర్చబడ్డాయి . పదిమంది వాద్యబృందాల మధ్య ఒక స్థ్థ్రీ పలుచటి చీరని బొడ్డుకిందకి కట్టీ, లోనెక్ జాకట్టులోని అందాలు వంగి , వంగి మరీ చూపిస్తూ ..అర్ధం , పర్ధం లేని పాటలు పాడుతోంది . ఆమె చేస్తున్న డేంస్కి అనుగుణంగా ,చప్పట్లు కొడుతూ, జనం ఈలలు వేస్తున్నారు .ఒక జునపాల జుట్టాయన చినిగిన జీంస్ , చేతుల్లేని చొక్కాతో అష్థవంకర్లు పోతూ ఆమెమీద పడుతున్నపుడల్లా జనం వెర్రికేకలు వేస్తున్నారు . కెమేరావాళ్ల హడావిడి, వీడియోవారి తోపులతో , మరింత మూలకి జరపబడ్డ సీతారాముల విగ్రహాలు , భక్తిలేని జనాలమధ్య , కాంతిహీనమై వెలవెల పోతున్నాయి . ఈ కాలుష్యాన్ని ఎక్కడ చూస్తుందో నని భయపడ్డ రాఘవగారు కావ్యనెత్తుకొని జనాన్నితోసుకుంటూ బయటపడ్డారు .

పక్కవీధిలో జరిగే కోలాహలంలో ఒకవంతైనా కచేరీ జరిగేచోటికి రానందుకు , మన సంస్కృతి విలువలు తగ్గేయి అనుకున్నారు కానీ మరీ ఇంతలా దగజారిపోయాయా .... అనుకొని , దిగ్భ్ర్రాంతిపడి ,ఆశ్చర్యపోయారు . అలసిన కావ్య భుజమ్మీదే నిద్రపోతున్నాది . ఆమెచేతిలో సభవారిచ్చిన గులాబీ వడలి వాలిపోతున్నాది .

కావ్య మొహం చూసిన రాఘ్వగారి కంట్లో నీరు చిమ్మింది . ఈ చిన్నారికి ఎన్నిమాటలు చెప్పేనూ, ఎన్ని ఆశలు చూపించేనూ ... మొదటిసారే ఘోరంగా విఫలమై , మనసులో తగిలినగాయం ,చిదిమి చీము పట్టదుకదా...

ఆలోచనలతో నిస్థ్ర్రాణ ఆవహించిన రాఘ్వగారు తమ ఇంటి సందులోకి ప్రవేసించీ, మెల్లగా నడవసాగేరు .తమవీధి వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం చిరుదివ్వెవెలుగులో చిద్విలాసంగా కటకటాలతలుపువెనక కవ్విస్తూకనిపించింది . ఒక్కక్షణం ఆగేరు . రాఘవగారు తప్ప ఆదేవదేవునికి సుప్రభాత, పూజాపునస్కారాలు చేసేవారులేరు . ఏ పండగకో, పుణ్యానికో పక్కవూరి పూజారిగారితో అర్చనలు చేయించుకుంటారు ఆవూరివారు . అయినాసరే స్వామి నవ్వుతూ అలా నిల్చునేవుంటారు . ఈ ప్రజలసంగతి తెలిసినవాడు కనకనే శిలారూపంలో బిగుసుకుపోయాడు .

నిద్రపోతున్న కావ్యని కింద పడుక్కోబెట్టీ, గుడి స్థంభానికి ఆనుకొని కూర్చున్నారు .
కళాపోషణ లేని సంస్కృతికి నిదర్సనంగా దూరంగా మైకులోంచీ బూతుపాటలు వినిపిస్తున్నాయి . ఈలలగోల చీదరపరుస్తున్నాది .

'' ఇదీ ఒకరకమైన కళాపోషణేకదా '' అన్నట్లు స్వామివారి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూనేవుంది  .
------------------------- 

రచయిత్రి.
శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------------------------------------------------


Sunday, December 11, 2022

ఓటు..నోటు. ( కవిత.)

11/12/2022.
శ్రీశ్రీ కళావేదికలో కవితాపొిటీలు
అంశం : ఓటు--నోటు.
శీర్షిక : నేటి భారతం .

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .


మనిషిలో పేరుకుపోతున్న స్వార్ధం
ధన  దాహానికి ఆవిరైపొితున్న మానవత్వం .
తన- పర "ల  బేధాన్ని  మరచిన కాముకత్వం.
మాదక ద్రవ్యాల మత్తుకు చిత్తైపోతున్న జనం ॥

నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు
తీరని సమస్యలతో  అడుగడుగున అగచాట్లు 
 ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.
 నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.
మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో
 కౌంట్  ఔతున్న ,నోట్లకు అమ్ముడుపోయిన  ఓట్లు   కొడుతున్న సిక్సర్లు.
 ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న అక్రమ- నాయకత్వాలు ॥
 
నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .
బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.
 ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.
 గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥

ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .
 కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .
మద్యం వేటగాళ్ళకు  మత్తు మందుతో వైద్యం . 
నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥

ఇదే ఈనాటి  అవినీతి నిండిన....
చదరంగపు టెత్తులకు సమసిపోయిన నేటి భారతం..
కలలు కల్లలైన ఓడిన నాటి భారతి కన్నీటి కథనం ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.


Saturday, December 10, 2022

బాల సాహిత్యం...




అంశం : బాల సాహిత్యం .
"వ"   గుణింతం .
శీర్షిక  : మంచి మాటలు.

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .

వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥

వచ్చె భానుడదె నిదుర లేవండి
విసుగు మాని ఇక బడికి వెళ్లండి
విద్య విలువనే తెలియరారండి
వందనాలు మీ గురులకిడి రండి ॥

వందనీయులౌ గురుల విడకండి 
వారు చెప్పేటి బాట నడవండి .
వావి వరుసలకు విలువలివ్వండి  
వలయు వ్యక్తిత్వముంచి మెలగండి ॥ 

వెలుగు బాట  విజ్ఞాన మొందగా
విధిగ  విలువైన విద్య నేర్వండి ॥
వరుస గెలుపులను పొంద పోరండి
విమల యశులైన కీర్తినొందండి  ॥

విరులు మాలగా జేసుకొని రండి
విష్ణు  దేవునీ మెడను వేయండి
వేల్పు కొలువులిల అమ్మ నాన్నండి.
వలయు మార్గదర్శకులు వారండి ॥

వేద పాఠాలు వేల గ్రంధాలు
వేల నీతులిడు మలుపు  అందాలు.
వరలు సంపదలు సాంప్రదాయాలు,
వైభవమ్ములిల  జగతి బంధాలు॥

వైరి భావములు విడచి సాగుమా
వృక్ష రాజముల నరక బోకుమా.
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వరలు సంపదది విద్యయే సుమా॥

వట్టి మాటలిక గట్టిపెట్టుమా
విలువ పెంచు ఘన నీతి నెరుగుమా..
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥
[10/12 23:56] +91 99890 18003: 41)
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు మీ 
శీర్షిక  : మంచి మాటలు.
వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥
-------
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥
👉 వెన్నెల్లో వన్నెల వెన్నముద్దలు మీ అక్షరలయలు. మెదడు మెచ్చుకొను  మంచి ముత్యాలు.అధ్బుతం అభినందనలు 🙏🎉💐💐🎉🙏

బాల సాహిత్యం. " వ " గుణింత పదాలతో....

10/12/2022.
మహతీ సాహితీ కవి సంగమం 

అంశం : బాల సాహిత్యం .
"వ"   గుణింతం .
శీర్షిక  : మంచి మాటలు.

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర  .

వరుస  పసి తనపు పాలుగారుచుా
వలపు తేనొలుకు మాటలాడుచుా 
వెలుగు కలలలో తేలియాడుచుా
వేడ్క మురిపించు ముద్దు బాలలుా ॥

వచ్చె భానుడదె నిదుర లేవండి
విసుగు మాని ఇక బడికి వెళ్లండి
విద్య విలువనే తెలియరారండి
వందనాలు మీ గురులకిడి రండి ॥

వందనీయులౌ గురుల విడకండి 
వారు చెప్పేటి బాట నడవండి .
వావి వరుసలకు విలువలివ్వండి  
వలయు వ్యక్తిత్వముంచి మెలగండి ॥ 

వెలుగు బాట  విజ్ఞాన మొందగా
విధిగ  విలువైన విద్య నేర్వండి ॥
వరుస గెలుపులను పొంద పోరండి
విమల యశులైన కీర్తినొందండి  ॥

విరులు మాలగా జేసుకొని రండి
విష్ణు  దేవునీ మెడను వేయండి
వేల్పు కొలువులిల అమ్మ నాన్నండి.
వలయు మార్గదర్శకులు వారండి ॥

వేద పాఠాలు వేల గ్రంధాలు
వేల నీతులిడు మలుపు  అందాలు.
వరలు సంపదలు సాంప్రదాయాలు,
వైభవమ్ములిల  జగతి బంధాలు॥

వైరి భావములు విడచి సాగుమా
వృక్ష రాజముల నరక బోకుమా.
వజ్ర వైడుార్యముల వెంట బడకుమా
వరలు సంపదది విద్యయే సుమా॥

వట్టి మాటలిక గట్టిపెట్టుమా
విలువ పెంచు ఘన నీతి నెరుగుమా..
వెన్నెలంటి చిరునవ్వు తోడుగా
విశ్వ హితుడవై నిలచిపోవుమా ॥






Tuesday, December 6, 2022

రుబాయిలు.

[06/12, 12:10 pm] iswar new jio: 06/12/2022..
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం - రుబాయీలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎవరికైనా అవకాశమది ఒక్కసారే వస్తుందిగా.
అదృష్టమది  ఉన్నదంటే  నిన్నుకోరే వస్తుందిగా
 మంచినడతది భావితరాల జీవితాలకు మార్గదర్శది
 వ్యక్తిత్వాన్ని చంపుకుంటే కంటనీరే వస్తుందిగా ॥

ఎన్నికలలో  గెలవడానికి ప్రమాణాలిడి మరపిస్తారు 
గెలిచివచ్చీ దేశసంపద  విదేశాలకు తరలిస్తారు 
నాటి నుండీ నేటివరకు బానిసలుగా మనబతుకులు
రాజకీయపు రణనీతితో తమ మాటలను మరలిస్తారు

నేటి చదువులు  ప్రజలమదిలో  అజ్ఞానాన్ని పెంచుచున్నవి
అలోచనలు పెడత్రోవలో సుజ్ఞానాన్ని వంచుచున్నవి.
స్వార్ధం పెరిగి బంధాలనే మరచిపోయే  ముార్ఖుడుమనిషి.
కలికాలమిది బుద్ధిహీనత విజ్ఞానాన్ని  తుంచుచున్నవి॥
[06/12, 2:41 pm] +91 78423 68534: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు -6
అవకాశం ఒకసారే వస్తుందని, అదృష్టం తనే వరిస్తుందనీ.. రాజకీయం గణనీతి లో మరలిపోయే మాటలే  బాగా వ్రాశారు 🙏💐👌

రుబాయిలు

06/12/2022..
 
అంశం - రుబాయీలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎవరికైనా అవకాశమది ఒక్కసారే వస్తుందిగా.
అదృష్టమది  ఉన్నదంటే  నిన్నుకోరే వస్తుందిగా
 మంచినడతది భావితరాల జీవితాలకు మార్గదర్శది
 వ్యక్తిత్వాన్ని చంపుకుంటే కంటనీరే వస్తుందిగా ॥

ఎన్నికలలో  గెలవడానికి ప్రమాణాలిడి మరపిస్తారు 
గెలిచివచ్చీ దేశసంపద  విదేశాలకు తరలిస్తారు 
నాటి నుండీ నేటివరకు బానిసలుగా మనబతుకులు
రాజకీయపు రణనీతితో తమ మాటలను మరలిస్తారు

నేటి చదువులు  ప్రజలమదిలో  అజ్ఞానాన్ని పెంచుచున్నవి
అలోచనలు పెడత్రోవలో సుజ్ఞానాన్ని వంచుచున్నవి.
స్వార్ధం పెరిగి బంధాలనే మరచిపోయే  ముార్ఖుడుమనిషి.
కలికాలమిది బుద్ధిహీనత విజ్ఞానాన్ని  తుంచుచున్నవి॥

వెన్నెముక రైతన్న  మనసదే  బాధగా
బీడైన మట్టిలో  తడన్నదె   లేదుగా
వానకై నిరీక్షణ  , నిరాశదె జీవితం
మట్టిమనిషి మనసులో ఆశన్నది  పోదుగా





Monday, December 5, 2022

శీర్షిక : అమ్మ చేతి బొమ్మలు.

శీర్షిక : అమ్మ చేతి బొమ్మలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

."అమ్మ" అనే ఆడ బొమ్మ
ఆమె ఒడిలో నా జన్మ 
నా జీవిత  గీతనే 
చెరిపి రాయు మరో బ్రహ్మ ॥

అందమైన ఆడతనం 
అమ్మైన నిండుదనం..
బంధమైన ఆనందం  
ఆ నవ్వులె ప్రేమమయం.॥

పేదరికం  అడ్డనదు
బాధన్నది తెలియనీదు
బరువన్నదెంతైన గాని
భారమని  అననిదమ్మ ॥

అమ్మా అన్న పిలుపుకు 
పులకించిన మనసుకు
కష్టమంత ఇష్టమైన 
కన్న ప్రేమ నిండు తనం ॥

కుాటి కొరకు  అగచాట్లు 
అమ్మకవి కావు పాట్లు
పిల్ల కడుపు నింపుదారి 
అమె నడక ఆగదోయి ॥

దేముడు చేసిన బొమ్మ 
దేముడినే మొాస్తున్నదమ్మ
నారు పొిసిన వాడే  నేడు
అమ్మ చేతిలొ బొమ్మైనాడు ॥

విధి ఆడిన ఆటలో  
ఆమె పాత్ర వేటలో 
వేల్పు లామె గంపలో
మట్టి రుాపు చేతలో ॥

గంప బరువు భారమైన
గంపెడంత ఆశ , లోన..
"బెమ్మా"డిన ఆటలోన 
"అమ్మె"గెలిచెనాటలోన ॥

********************