Friday, April 29, 2022

కష్టే...ఫలే...

29/04/2022.
మే డే సందర్భంగా..
మనుమసిద్ధి కవన వేదికలో

అంశం :  శ్రామిక సౌందర్యం.
శీర్షిక :  కష్టే ..ఫలే...
ప్రక్రియ :వచన కవిత.

కష్టే ఫలే అన్నారు పెద్దలు.
కష్ట పడిన వారెవరుా నష్టపోలేదెపుడుా.
నాటి రోజుల్లో తొలి కోడి కుాతకే
నిదుర లేచి కాలకృత్యాలు తీర్చుకొని
పార పలుగులతో కాలి నడకన ,కుాలి 
పనులకు పోయేవారు స్త్రీలు ,పురుషులుా.
సంధ్య వేళకు  తమ తమ ఇళ్ళకు చేరి , 
ఆరుబయట  ఇరుగు పొరుగులతో 
కష్ట సుఖాల కలగల్పు ముచ్చట్లు పంచుకొని ,ఆనందంగా అలసిన 
శరీరాలకు  విశ్రాంతినిచ్చేవారు.
శ్రమయే జీవితానందంగా గడిపిన వారికి
రోగాలుా తెలియవు .భోగాలుా తెలియవు.
ఉన్న దానితో సంతృప్తి పడుతుా, ఊరంతా 
ఉత్సాహంగా కలసి మెలసి గడిపేవారు.
నేడు కష్టం తెలీని ఖర్మకు కదలేని కాయం .
కడు రోగాల నిలయమై కల్తీ మందుల
కటిక బాధల వలయమై, వ్యాయామాల 
ఉచ్చులో వ్యాకులత పడుతున్నాది.
ప్రతీ పనీ యంత్రాల పరమై  
జీవితమంతా యాంత్రికమైపోయింది.
నడవడానిక వైద్యుని సలహా నింపు
తినడానికి కొలతల మినహాయింపు
ఆనందానికి కృత్రిమ నవ్వుల హోరు
నడక  వేగానికి ట్రేడ్ మిల్ జోరులతో
జనులు శ్రమైక జీవితానందాన్ని కోల్పోతున్నారు
 ఇప్పటికైనా కాయానికి కష్టం నేర్పండి.
 ఆనందంగా అందరిలోనుా మెలగండి.
 శ్రామిక సౌందర్యాన్ని  ఆస్వాదించండి.

హామీ.
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా 
ప్రచురితము కాని నా స్వీయ రచన.






No comments:

Post a Comment